

జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న విజయనగరం నగరంలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ రన్కు సంబంధించిన టీ-షర్ట్స్, క్యాప్స్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం స్థానిక జి.ఎస్.ఆర్ హోటల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఒలింపిక్ రన్ స్థానిక కోట వద్ద ప్రారంభమై మూడు లాంతర్లు, గంటస్తంభం మీదుగా రాజీవ్ స్టేడియం వరకు కొనసాగుతుందని తెలిపారు. క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులను ఆహ్వానించినట్లు వెల్లడించారు.
జిల్లాలోని క్రీడాకారులు, వ్యాయామ ప్రేమికులు, యువత, క్రీడా ప్రోత్సాహకులు పెద్ద ఎత్తున పాల్గొని ఒలింపిక్ రన్ను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
టీ-షర్ట్స్, క్యాప్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విజయ్, జిల్లా స్క్వాష్ అసోసియేషన్, గురాన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు గురాన రాధిక, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సి.హెచ్. వేణుగోపాలరావుతో పాటు వివిధ క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.