వి.ఆర్.పురంలో జనసేన ఉద్యమి సభ్యత్వాలపై అవగాహన సమావేశం

రంపచోడవరం: జనసేన పార్టీ వి.ఆర్.పురం మండలం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమి (క్రియాశీలక) సభ్యత్వ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. సభ్యత్వాలను నిర్వహిస్తున్న సాధక్‌లు హాజరైన ఈ సమావేశంలో మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ మాట్లాడారు.

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్త కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో వారికి భరోసా కల్పించేలా పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా క్రియాశీలక సభ్యులకు రూ.5 లక్షల బీమాతో కూడిన ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నారని చెప్పారు. అలాగే పార్టీలో కార్యకర్తగా ప్రారంభమై నాయకుడిగా ఎదగాలని సంకల్పం ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రతి కార్యకర్తను గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని మండలంలోని ప్రతి గ్రామానికి విస్తరించేలా, జనసైనికులు, అభిమానులు మరియు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా మండల ముఖ్య నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీలు ముద్రించి పంపిణీ చేసినట్లు తెలిపారు. మండలంలో ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని, పార్టీలో పదవులు పొందాలన్నా లేదా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలన్నా సభ్యత్వం తప్పనిసరి అని తెలియజేశారు.

అదేవిధంగా మార్చి 14న పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు వి.ఆర్.పురం మండలం నుంచి భారీ సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు, నాయకులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కనుగుల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోట్ల రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి బాగుల అంజనరావు, యూత్ లీడర్లు ముంజపు సాయిరాం, పెడపెట్ల పవన్ కళ్యాణ్, అలాగే కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు మాచర్ల వేణుబాబు, పెట్ట నాగేంద్రబాబు, ముంజపు శ్రీరామ్, చిన్నంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.